కుటుంబ కలహాలు; కూతురిని పూడ్చి పెట్టిన తల్లి

12 Feb, 2020 13:31 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అత్తింటి వారితో గొడవపడి ఏడాదిన్నర కూతురితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వివరాలు.. పెందుర్తి  పరిధిలోని పులగాని పాలెంలో కుసుమలత అనే మహిళ.. తన భర్త, 18 నెలల కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కుంటుంబ కలహాలతో కుసుమలత తన కూతురిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయింది. అదే రోజు తన భార్య, కూతురు కనపడటం లేదని ఈనెల 6వ తేదిన పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కుసుమలత భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి మహిళ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 

కాగా ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో చిన్నముషిరివాడ వుడా కాలనీ కొండలమీద నుంచి ఓ మహిళ కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను కుసుమలతగా గుర్తించారు. పాప ఏదని కుసుమలత తల్లిని విచారించగా తన కూతురు చనిపోయిందని, కొండ ప్రాంతంలో పాతి పెట్టానని  చెప్పింది. ఈ క్రమంలో కొండపైన పోలీసులు గాలిస్తుండగా.. ఎర్ర కొండపై చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్నిపోలీసులు కనుగొన్నారు. బిడ్డ మృతదేహాన్ని చూసి, తండ్రి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహిళ ఆత్మహత్య ప్రయత్నం విఫలమవడంతో శరీరం నిండా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు