లక్నో: తన పాలిట కీచకుడిగా మారిన మామను కోడలు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని మధోతండా పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం తన కొడుకు పనికి వెళ్లిన సమయంలో కోడలిపై మామ అత్యాచారం చేశాడు. తర్వాత రోజు మరోసారి అకృత్యానికి ఒడిగట్టడంతో బాధితురాలు భర్త సహాయంతో మామను కర్రతో కొట్టి చంపింది. తర్వాత వీరిద్దరూ స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
మృతుడి పెద్ద కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు తెలిపారు.