అనుమానంతో నాలుగోభార్యను అతిదారుణంగా..

18 May, 2018 15:23 IST|Sakshi

భోపాల్‌: వేధింపులకు తాళలేక మొదటి ఇద్దరు భార్యలు అతణ్ని వదిలేసి పోయారు.. మూడోభార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.. ఇప్పుడు నాలుగోభార్యను అతికిరాతకంగా చంపేశాడు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో గురువారం వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి అశోకా గర్డెన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ సునీల్‌ శ్రీవాస్తవ చెప్పిన వివరాల ప్రకారం..

భోపాల్‌లోని ప్రగతి నగర్‌ ప్రాంతంలోని ఓ గదిలో దంపతులు అద్దెకుంటున్నారు. మూడురోజులుగా రాకపోకలులేకపోవడం, గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. గదితలుపులు పగులగొట్టగా.. దాదాపు కుళ్లిపోయే దశకు చేరిన మహిళ మృతదేహం కనిపించింది. పోస్ట్‌మార్టంలో.. మృతురాలిపై అత్యాచారం జరిగినట్లు, శరీరభాగాల్లోకి బీరు సీసాలు దించినట్లు గుర్తించారు. గంటలపాటు సాగిన వేటలో పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో స్థానికుల సాక్ష్యాలు కీలకంగా మారాయి. సదరు నిందితుడు రోజుకూలీగా పనిచేసేవాడని, ఆమె మాత్రం ఇంట్లోనే ఉండేదని స్థానికులు చెప్పారు. ఇంటి యజమానితో మహిళకు సంబంధం ఉందేమోనన్న అనుమానంతో అతను నిత్యం గొడవపడేవాడని పేర్కొన్నారు. పోలీసు కస్టడీలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, ఆమె అతనికి నాలుగోభార్య అని, ఇంతకుముందు మూడో భార్య కూడా అనుమానాస్పద రీతిలో మరణించిందని ఎస్సై శ్రీవాస్తవ వివరించారు.

మరిన్ని వార్తలు