పోలీసుల సమక్షంలోనే యువతి ఆత్మహత్యయత్నం

17 May, 2018 06:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని మనస్తాపం

తూర్పుగోదావరి ,పిఠాపురం రూరల్‌/సర్పవరం: పిఠాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగింది. ఆమెను చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన యువతి కర్రి దేవి తన స్నేహితురాలితో పిఠాపురంలోని ఓ జిమ్‌కు వెళ్లేది. ఇదే జిమ్‌కు పిఠాపురం పట్టణం మంగయమ్మరావుపేటకు చెందిన చింతా మహేష్‌ వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో మహేష్‌ దేవితో పరిచయం పెంచుకుని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లి విషయాన్ని దేవి ప్రస్తావించగా మహేష్, అతని బంధువులు నిరాకరించడంతో 15 రోజుల క్రితం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది.

ఈ మేరకు పిఠాపురం సీఐ బి.అప్పారావు బుధవారం కౌన్సెలింగ్‌ నిమిత్తం దేవి, మహేష్‌లను తన కార్యాలయానికి పిలిపించారు. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా మహేష్‌ పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పడంతో మనస్తాపంతో దేవి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. అక్కడే ఉన్న బాధితురాలి బంధువులు, పోలీసులు ఆమెను పిఠాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై  చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. బాధితురాలి బంధువులు మాట్లాడుతూ దేవి పిఠాపురం జిమ్‌కు వెళ్లే సమయంలో పిఠాపురం చర్చి సెంటర్‌లో బట్టల దుకాణం నిర్వహిస్తున్న చింతా సాంబ కుమారుడు మహేష్‌ అదే జిమ్‌ కోచ్‌గా చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి వంచించాడని, దఫదఫాలుగా అతడి కుటుంబ సభ్యులను తీసుకువచ్చి వరకట్నం అడిగాడని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు