ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

18 May, 2018 08:46 IST|Sakshi
సుజాత మృతదేహం

గుంతకల్లు రూరల్‌: ఎంతో ప్రాణంగా ఏడేళ్లుగా ప్రేమించిన మేనమామ పెళ్లికి నిరాకరించడంతో గుంతకల్లు మండలంలోని దోసలుడికి గ్రామానికి చెందిన సుజాత (24) అనే యువతి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాములు, గురులక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా అందులో రెండో కూతురు సుజాత.  అదే గ్రామానికి చెందిన తన మేనమామ గురునాథ్, సుజాతలు ఇద్దరు ఏడేళ్లుగా  ప్రేమించుకుంటున్నారు. సుజాత పెళ్లి  ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ అప్పులు, ఇతర సమస్యలను సాకుగా చూపి గురునాథ్‌ మాట దాటవేస్తూ వచ్చాడు. మేనమామపైనే ఆశలు పెట్టుకున్న సుజాత ఇంట్లో వేరే పెళ్లి  సంబంధాలు చూడటంతో గురునాథ్‌ను తప్ప వేరేవాళ్లను చేసుకోనంటూ ఇంట్లో వాళ్లకు తెగేసి చెప్పింది.

కొంత కాలం తరువాత పెళ్లి చేసుకుంటానని గురునాథ్‌ కూడా అంగీకరించడంతో సుజాత తల్లిదండ్రులు ఆమెను ఏడాది క్రితం మూడో కూతురుకు వివాహం చేశారు. కాగా గురునాథ్‌  ఇటీవల సుజాతతో పెళ్లిచేసుకోనని తెగేసి చెప్పడంతో సుజాత తీవ్ర మనస్థాపానికి గురైంది. కూతురు బాధను చూడలేని ఆమె తల్లి ఆగ్రహంతో  తన కూతురుకు వేరే సంబంధం చూసేందుకు సిద్ధపడింది. గురువారం ఉదయం పెళ్లి సంబంధం చూడటానికి ఏర్పాట్లు చేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుజాత బుధవారం అర్ధరాత్రి సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.  గురువారం ఉదయం కొన ఊపిరితో ఉన్న సుజాతను చూసిన కుటుంబ సభ్యులు  అసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యంలోనే  ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదుచేసకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు