హోంమంత్రి చాంబర్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

7 Oct, 2017 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదంటూ.. హైదరాబాద్‌కు చెందిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సాయికుమార్‌ భార్య, కూకట్‌పల్లి నివాసి స్వప్న హోంమంత్రికి విన్నవించుకునేందుకు శుక్రవారం సచివాలయానికి వచ్చింది. హోంమంత్రి చాంబర్‌ ఎదురుగానే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సాయికుమార్‌కు పెళ్లయిన విషయం దాచిపెట్టి మోసం చేయడంతో పాటు, తాజాగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని స్వప్న ఆరోపించింది.

ఈ విషయమై ప్రశ్నించినందుకు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీనిపై ఇప్పటికే కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, విచారించి సాయికుమార్‌ను సస్పెండ్‌ చేసినట్టు వివరించింది. సస్పెన్షన్‌ తర్వాత మరింత చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వాపోయింది. ఆత్మహత్యకు పాల్పడ్డ స్వప్నను సైఫాబాద్‌ పోలీసులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. స్వప్నకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

>
మరిన్ని వార్తలు