ప్రయాణికురాలికి ఎయిర్‌ఏషియా సిబ్బంది వేధింపులు

10 Nov, 2017 17:28 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : ప్రయాణికుల పట్ల ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో  తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెండు రోజలు క్రితం ఇండిగో సిబ్బంది ఓ వ్యక్తిని ఈడ్చిపడేయటం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోక ముందే బెంగళూర్‌లో మరో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. 

ఓ ప్రయాణికురాలిపై ఎయిర్‌ఏషియా ఎయిర్‌లైన్‌ సిబ్బంది వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పైలెట్‌సహా ఇద్దరు సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమె కేసు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేసుకున‍్న బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లను చేర్చారు. 

అసలేం జరిగిందో యువతి మాటల్లోనే... నవంబర్‌ 3న ఆ యువతి రాంచీ నుంచి బెంగళూర్‌కు ఏయిర్‌ ఏషియా విమానంలో ప్రయాణించింది. విమానం టేకాఫ్‌ తీసుకునే సమయంలో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయమని సూచించటంతో యువతి ఆ పని చేసింది. అయినప్పటికీ పైలెట్‌తో సహా ఆ ఇద్దరు సిబ్బంది అనవరసంగా దూషించారని.. ఒకానోక సమయంలో విమానం నుంచి దించేస్తామని తనను బెదిరించారని ఆమె చెప్పింది. ఇక విమానం సరిగ్గా ఉదయం 12గం.45ని. సమయంలో  బెంగళూర్‌లో ల్యాండ్‌ కాగా.. ప్రయాణికులందరినీ పంపించి వేసి తనను మాత్రం అడ్డుకున్నారని యువతి తెలిపింది. 

తన తప్పేంటో చెప్పకుండా తనను ఎందుకు ఆపారని ప్రశ్నిస్తే.. పైలెట్‌కు క్షమాపణలు చెబితేనే వెళ్లనిస్తామని చెప్పి ఆ ఇద్దరు సిబ్బంది సమాధానమిచ్చారంట. క్షమాపణలు చెప్పకపోతే ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని.. బయట దొరకబుచ్చుకుని సంగతి తేలుస్తామని బెదిరించారని చెప్పింది. అలా కాసేపు సతాయించాక మూడు గంటల ప్రాంతంలో తనను ఎయిర్‌పోర్టు పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి నిబంధనలు ఉల్లంఘించినట్లు రిపోర్ట్‌ చేశారని ఆమె పేర్కొంది. ఆపై స్నేహితురాలి సాయంతో ఆమె ఎయిర్‌ఏషియా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఘటనపై ఎయిర్‌ఏషియా ఇంకా స్పందించలేదు.  
 

మరిన్ని వార్తలు