బెడ్‌ కింద మృతదేహం.. తెలియక 5 రోజుల పాటు..

27 Jan, 2019 13:49 IST|Sakshi

పట్నా : బీహార్‌లో దారుణం జరిగింది. భార్యను చంపి తన యజమాని ఇంట్లో ఉన్న బెడ్‌ బాక్స్‌లో దాచాడో కసాయి భర్త. బెడ్‌ కింద మృత దేహం ఉందని తెలియక దాదాపు ఐదు రోజుల పాటు ఆ బెడ్‌పైనే నిద్రించాడు ఆ ఇంటి యజమాని. భరించరాని దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్‌లోని గయాకి చెందిన దినేష్‌ కుమార్‌ అనే టీ వ్యాపారి వద్ద రాజేష్‌ కుమార్‌ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజేష్‌ తన భార్య బబితతో కలిసి యజమాని ఇంట్లోనే కిరాయికి ఉంటున్నాడు. 

కాగా ఇటీవల వ్యాపార నిమిత్తమై దినేష్‌ వేరే పట్టణానికి వెళుతూ ఇంటి తాళాలు రాజేష్‌కు ఇచ్చి వెళ్లాడు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన దినేష్‌కు తన బెడ్‌రూంలో ఏదో దుర్వాస వచ్చింది. ఎలుకలు చనిపోవడం వల్ల ఈ దుర్వాసన వస్తుందని భావించి దినేష్‌ అదే బెడ్‌పై పడుకున్నాడు. ఇలా  రోజు రోజుకి దుర్వాసన పెరుగుతూ వచ్చింది. భరించరాని దుర్వాసన రావడంతో ఐదు రోజుల తర్వాత( శనివారం) దినేష్‌ తన బెడ్‌ను ఓపెన్‌ చేసి చూసి షాకయ్యాడు. బెడ్‌ కింద కుళ్లిపోయిన మహిళా మృతదేహం కనిపించింది. ఆ మృత దేహాన్ని తన డ్రైవర్‌ రాజేష్‌ భార్య బబితగా గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.

అయితే బబితను తన భర్త రాజేష్‌యే హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి కూడా రాజేష్‌యే తన కూతురిని హత్య చేశాడని ఆరోస్తున్నారు. కాగా రాజేష్‌ పరారిలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పోలీసులు పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు