సాక్షి, భువనేశ్వర్ : జీడి తోటకు వెళ్లిన మహిళపై దాడి చేసి చంపిందో ఏనుగు. ఈ సంఘటన ఢెంకనాల్ జిల్లా హిందోల్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొబొంధో గ్రామంలో ఉంటున్న దమయంతి బిశ్వాల్ అనే మహిళ గ్రామ సమీపంలోని జీడి తోటకు వెళ్లింది. అదే సమయంలో అటువైపు వచ్చిన ఏనుగును ఆమె గమనించలేదు. అది సమీపంలోకి చేరుకున్న తర్వాత గుర్తించిన దమయంతి పరుగులు పెట్టింది. అయితే ఆమెను వెంబడించిన ఏనుగు దాడి చేసి చంపేసింది. హిందోల్ అటవీ రేంజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికి సామూహిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా, ఈ ప్రాంతంనుంచి గజరాజును అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.