గమ్యం చేర్చింది.. ప్రాణం తీసింది

19 Dec, 2018 10:32 IST|Sakshi
కవిత మృతదేహం

బస్సు దిగుతుండగా అదుపుతప్పి కిందపడిన మహిళ

డ్రైవర్‌ ముందుకెళ్లడంతో చక్రాల కింద నలిగి మృతి

చిత్తూరు, సూళ్లూరుపేట: గమ్యం చేర్చిన బస్సే ఆమె ప్రాణం తీసింది. ఈ ఘటన మంగళవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం సంతవేలూరుకు చెందిన కుప్పాని కవిత (35) సూళ్లూరుపేటలోని నారాయణ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె మంగళవారం విధులకు హాజరయ్యేందుకు సంతవేలూరులో సూళ్లూరుపేట – శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్సు ఎక్కింది. స్థానిక వినాయకుడి గుడి సెంటర్‌లోని బస్‌స్టాప్‌లో దిగుతుండగా చీర డోర్‌కు ఇరుక్కుని అదుపుతప్పి కింద పడిపోయింది.

బస్సు డ్రైవర్‌ ఆమె దిగిందనుకుని వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. వెనుక టైర్‌ ఆమె మీదకు ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కొన ఊపిరితో ఉందనుకుని వెంటనే స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్‌ నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు