సాక్షి, న్యూఢిల్లీ : కదులుతున్న రైలు ముందుకు దూకి మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఢిల్లీ మెట్రో మోడల్ టౌన్ స్టేషన్లో వెలుగుచూసింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఉదంతం స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వేగంగా స్టేషన్ వద్దకు దూసుకొస్తున్న మెట్రో రైలుకు ఎదురుగా 26 సంవత్సరాల మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత మహిళను ఢిల్లీలోని పహల్గంజ్లో నివసించే అకౌంటెంట్ మీనాక్షి గార్గ్గా గుర్తించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.
తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని రాసిఉన్న సూసైడ్ నోట్ను ఘటనా స్ధలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. కాగా ఆమె వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని మహిళ కుటుంబ సభ్యులు తెలిపారు. వారం వ్యవధిలో ఢిల్లీ మెట్రోలో ముగ్గురు ఆత్మహత్మ పాల్పడటం గమనార్హం. సెప్టెంబర్ 2న జందేలవలన్ స్టేషన్లో 45 ఏళ్ల మహిళ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడగా, మరుసటి రోజే 22 సంవత్సరాల ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు అక్షర్ధామ్, నొయిదా ఎలక్ర్టానిక్ సిటీల మధ్య వేగంగా దూసుకెళుతున్న మెట్రో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.