లక్నో : ప్రియుడిని పెళ్లి చేసుకోవటానికి మాజీ ప్రియుడు అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో మాజీ ప్రియుడ్ని దారుణంగా హత్య చేయించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బరేలీకి చెందిన ఉమా శుక్లా అనే యువతి 2014లో భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో యోగేశ్ సక్సేనాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఉమా, యోగేశ్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అదే విషయాన్ని అతనికి చెప్పింది. తన సోదరికి పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని, అంతవరకు ఆగమని అతడు చెప్పాడు. కొన్ని నెలల తర్వాత ఆమెకు సునీల్ శర్మ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
అయితే తమ పెళ్లికి తన మాజీ ప్రేమికుడు అడ్డువస్తాడని భావించింది ఉమా. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని భావించింది. ప్రియుడితో కలిసి యోగేశ్ హత్యకు ప్లాన్ వేసింది. పథకం ప్రకారం సోమవారం రాత్రి వేళ యోగేశ్ను ఒంటరిగా ఓ నిర్మానుష ప్రదేశానికి రప్పించారు. అదునుకోసం ఎదురు చూస్తున్న సునీల్.. యోగేశ్ అక్కడికి రాగానే కళ్లలో కారం చల్లి, గొంతుకోసి చంపేశాడు. అతడు చనిపోయాడని ధ్రువీకరించుకున్నాక, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ కేసును ఓ సవాలుగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నేరస్తుల్ని పట్టుకున్నారు.