విషపు ఇంజక్షన్‌ ఎక్కించుకొని...

28 Feb, 2018 10:45 IST|Sakshi
ఎంవీఏ లక్ష్మీ (పాత ఫొటో)

వైద్యురాలి ఆత్మహత్య

సాక్షి, హైదరాబాద్‌: అనుమానస్పదస్థితిలో ఓ వైద్యురాలు మృతిచెందిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ కథనం మేరకు. సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎంవీఏ లక్ష్మీ (43) సైనిక్‌పురి, హస్తినాపురి, జేపీ టవర్‌లో నివాసం ఉంటూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి హెచ్‌ఓడిగా విధులు నిర్వహిస్తుంది. అవివాహిత అయిన ఆమె ఒంటరిగానే ఉంటుంది. గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడాన్ని గుర్తించిన వాచ్‌మెన్‌ అపార్టుమెంట్‌ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లాడు.

ఆయన ఇరుగు పొరుగు సాయంతో పలుమార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులను బద్దలుకొట్టి చూడగా ఇంట్లో చాపపై ఆమె మృతి చెంది ఉంది. సంఘటన స్థలంలో రెండు ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను బట్టి ఆమె స్వయంగా విషాన్ని ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు