కుటుంబ సభ్యులకు విషం; వేరే వ్యక్తితో పరారీ..

30 Nov, 2019 10:50 IST|Sakshi
చికిత్స పొందుతున్న సిద్ధార్థ, పరిస్థితి విషమంగా ఉన్న మన్విత

చికిత్స పొందుతున్న నలుగురు కుటుంబ సభ్యులు

సాక్షి, గంగాధర(కరీంనగర్‌) : స్వీటు పదార్థంలో కుటుంబ సభ్యులకు విషం కలిపిచ్చిందో మహిళ. దాన్ని తిన్న నలుగురు స్పృహ తప్పి పడిపోగా.. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ ఘటన గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విలాసాగరం ఉమ గురువారం రాత్రి సేమియా తయారుచేసింది. దాన్ని భర్త విలాసాగరం అంజయ్య, మామ రాజేశం, కొడుకు సిద్దార్థ(11), కూతురు మన్విత(4)కు వడ్డించింది. అత్త లక్ష్మికి ఇవ్వగా తినలేదు. స్వీటుతిన్న కాసేపటికే నలుగురు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన ఉమ గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోయింది. శుక్రవారం వేకువజామున స్పృహలోకి వచ్చిన అంజయ్య తేరుకుని విషయాన్ని అదే గ్రామంలో ఉన్న బంధువులకు చెప్పేందుకు వెళ్తుండగా.. డ్రెయినేజీలో పడి గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు నలుగురిని వెంటనే కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు కోలుకోగా.. మన్విత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అంజయ్య తెలిపాడు.   


 

>
మరిన్ని వార్తలు