వైరల్‌ : మంట కలిసిన మానవత్వం..

28 Mar, 2018 13:41 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : మానవత్వం మంట కలిసింది. రద్దీగా ఉండే రోడ్డుపై ఓ 65 ఏళ్ల మహిళ ప్రమాదానికి గురైతే స్పందించే వారే కరువయ్యారు. ఆమె పక్కనుంచే చాలా వాహనాలు వెళ్తున్నా.. ఆమెకు సాయపడాలని ఎవరూ ముందుకు రాలేదు. అందులో ప్రభుత్వ అధికారుల వాహనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మానవ విలువలు ఏ స్థాయిలో పతనం అవుతున్నాయో తెలుపడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఆమెకు సహాయం చేద్దామని ఓ యువకుడు ముందుకొచ్చే వరకు అక్కడున్న వారు అదో వింతలా చూశారే తప్ప స్పందించలేదు. అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసు వాహనం ఈ సంఘటనని గమనించి ఆ మహిళను ఆస్పత్రికి చేర్చింది. తమకు ఈ ఘటనపై ఎవరూ సమాచారం ఇవ్వలేదని, గాయపడిన మహిళ చుట్టూ జనం చేరడం చూసి, ఆమెని ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదానికి కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నామని వారు వెల్లడించారు. కేరళలోని కడ్కావూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు