పెళ్లి పార్టీలో కాల్పులు.. వధువు మృతి

12 Feb, 2018 10:28 IST|Sakshi
మృతురాలు సాక్షి అరోరా (ఫైల్‌ ఫొటో)

డీజే పార్టీలో అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు

భవనంపై నుంచి తిలకిస్తున్న వధువు

పెరుగుతున్న గన్‌ కల్చర్‌

చంఢీఘడ్‌ : పంజాబ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో ఒకరి అత్యుత్సాహం పెళ్లికూతురు ప్రాణాలను తీసింది. ఈ ఘటన హోషియార్ పూర్‌లో గత శనివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన చరణ్‌జిత్‌ తన కూతురు సాక్షి అరోరా వివాహం వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. పెళ్లి వేడుకల్లో భాగంగా శనివారం డీజే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకను వధువు భవనంపై నుంచి తిలకిస్తోంది. ఇంతలో పెళ్లికి వచ్చిన అతిధుల్లో ఒకరు అత్యుత్సాహంతో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోని ఓ బుల్లేట్‌ భవనంపై ఉన్న వధువు తలకు తగలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది.

మృతురాలి తండ్రి చరణ్‌జిత్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 302, 34, ఆయుధాల వినియోగ చట్టాల కింద కేసు నమోదు చేశారు. చరణ్‌ జిత్‌ స్నేహితుడు, నిందితుడైన ఖోస్లాను అరెస్టు చేసి లైసెన్స్‌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు. ఇక వివాహ వేడుకల్లో గన్‌ కల్చర్‌ శృతి మించుతోంది. గతంలో హర్యానాలోని ఓ పెళ్లి సంగీత్‌లో ఇలానే అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరపడంతో వరుడు మృతి చెందాడు.

మరిన్ని వార్తలు