యువకుడిని చంపిన ప్రియురాలు, తల్లి

29 Jun, 2019 14:10 IST|Sakshi
తామరై సెల్వి- లక్ష్మి

సాక్షి, చెన్నై ‌: భువనగిరి సమీపంలో యువకుడిని హత్య చేసిన ప్రియురాలితో పాటు ఆమె తల్లిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కడలూర్‌ జిల్లా భువనగిరి సమీపంలోని కీరప్పాలయమ్‌కు చెందిన రామలింగమ్‌ కుమారుడు శ్రీనివాసన్‌ (23) ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. ఈ నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆవేదన చెందిన శ్రీనివాసన్‌ తల్లిదండ్రులు... బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కీరప్పాలయమ్‌ జేజేనగర్‌లో ముళ్లపొదరులో రక్త గాయాలతో శ్రీనివాసన్‌ శవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కీరప్పాలయానికి చెందిన కుమార్‌ భార్య తామరైసెల్వి (26), ఆమె తల్లి లక్ష్మి (45) గురువారం కీప్పాలయమ్‌ గ్రామ నిర్వాహక అధికారి ముత్తులక్ష్మి వద్ద లొంగిపోయారు. తామే శ్రీనివాసన్‌ని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని భువనగిరి పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో తామరైసెల్వి మాట్లాడుతూ.. తన భర్త కుమార్‌ విదేశంలో పని చేస్తున్నాడని..ఈ క్రమంలో తనకు శ్రీనివాసన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడిందని తెలిపింది. తరచు తన ఇంటికి వచ్చి వెళుతుండేవాడని.. విషయం తెలుసుకున్న తన భర్త కుమార్‌ తనను మందలించాడని పేర్కొంది. దీంతో శ్రీనివాస్‌ను ఇంటికి రావద్దని హెచ్చరించానని.. అయినా ఇతను ఇంటికి వచ్చేవాడని తెలిపింది. సంఘటన జరిగిన రోజు రాత్రి  ఇంటికి వచ్చిన శ్రీనివాసన్‌కి తనకు మధ్య గొడవ జరిగిందని..ఆవేశంలో తల్లి లక్ష్మితో కలిసి శ్రీనివాసన్‌ని కొట్టి హత్య చేశామని ఒప్పుకుంది. మృతదేహాన్ని ముళ్లపొదలో విసిరేశామని చెప్పింది. 

మరిన్ని వార్తలు