బావే హత్య చేయించాడు
మృతురాలి తమ్ముడి ఆరోపణ
చిత్తూరు , నారాయణవనం : మండల కేంద్రమైన నారాయణవనంలో సోమవారం మహిళ హత్యకు గురైంది. బావే అక్కను హత్య చేయించాడని మృతురాలి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన శివకుమార్ కొన్నేళ్ల క్రితం నారాయణవనంలో క్లినిక్ పెట్టుకుని ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. అలాగే మెడికల్ షాపును నిర్వహిస్తున్నాడు. హైవే సమీపంలో సొంత ఇంటిలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు ఆర్ఎంపీ శివకుమార్ భార్య సుజాత(32) మెడకు బాలికలు వేసుకునే లెగ్గిం గ్స్తో బిగించి హత్య చేయడానికి ప్రయత్నించారు.
ఆమె కేకలు విని ఇంటిపై అద్దె కు ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థి కౌశిక్ కిందకు వచ్చేలోపు దుండగులు పారిపోయారు. కొన ఊపితో ఉన్న సుజాతను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. అదే సమయంలో రోడ్డుపై పరుగులు తీస్తున్న ఇద్దరు యువ కులను స్థానికులు దొంగలుగా భావించి పోలీసులకు అప్పగించారు. సుజాత సోదరుడు వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న శివకుమార్ను పుత్తూరు సీఐ హనుమంతప్ప అదుపులో తీసుకున్నారు. పుత్తూరు ఇన్చార్జి డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ అనుమానితులతో పాటు సుజాత భర్త శివకుమార్ను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతురాలి సోదరుడు వినోద్ మాట్లాడుతూ తన అక్కను బావ శివకుమారే చంపించాడని ఆరోపించాడు.