భర్త మరణాన్ని తట్టుకోలేక దారుణం..!

14 Dec, 2019 19:43 IST|Sakshi

న్యూఢిల్లీ : భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ మహిళ దారుణానికి పాల్పడింది. కన్న కూతురికి ఉరివేసి చంపేసి.. తనూ ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన నొయిడాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. నొయిడా 1 సీఐ శ్వేతాబ్‌ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన వ్యక్తి (33) ఇక్కడి ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య(30), ఒక కూతురు(5).. ఢిల్లీలో పైలట్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్న తన తమ్ముడితో కలిసి సెక్టార్‌ 128లో గత నాలుగు నెలలుగా  నివాసముంటున్నాడు.  అయితే, శుక్రవారం ఉయదం 11.30 గంటల సమయంలో అతను జవహర్‌లాల్‌ నెహ్రూ మెట్రో స్టేషన్‌లో రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మనోహర్‌లాల్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భర్త మృతదేహాన్ని చూసిన అతని భార్య, తమ్ముడు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాత్రి కావడంతో వదిన, చిన్నారిని ఇంటికి పంపించిన మృతుని సోదరుడు ఆస్పత్రిలోనే ఉన్నాడు. శనివారం ఉదయం చూసేసరికల్లా వారి ప్లాట్‌లో తల్లీ కూతుళ్లు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. భర్త మరణం తట్టుకోలేకనే మహిళ తన కూతురు ప్రాణాలు తీసి.. తనూ బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు