భర్తను ముక్కలు ముక్కలుగా చేసి..

16 Jun, 2018 16:13 IST|Sakshi

సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఓ వ్యక్తి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కట్టుకున్న భార్యే నిందితురాలిగా తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 45 రోజుల క్రితం జిల్లాలోని కల్వకుర్తి పట్టణం హనుమాన్‌ నగర్‌ కాలనీకి చెందిన తన భర్త కావలి మల్లయ్య కనిపించడం లేదంటూ పార్వతమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భార్య పార్వతమ్యే తన భర్తను చంపినట్టు బయటపడింది. పార్వతమ్మకి రాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తన సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన ఇరువురు.. మల్లయ్యను హతమార్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌లతో కలిసి భర్తను హత్యచేసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బస్తాలో కట్టేసే జిల్లాలోని నాగనూల్‌ చెరువులో పడేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ పార్వతమ్మ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తమదైన శైలిలో దర్యాప్తు చేసిన పోలీసులు పార్వతమ్మే హత్య చేసినట్టు నిర్ధారించారు. దీంతో పార్వతమ్మ, ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు