మరదలిని హత్య చేసిన వదిన

10 Nov, 2019 10:44 IST|Sakshi

తిరువొత్తియూరు: మూర్చరోగంతో చికిత్స పొందుతున్న భర్త చెల్లెలిని ఓ వదిన కిరాతకంగా హత్య చేసింది. తన చికిత్స కోసం ఎక్కువ నగదు ఖర్చు పెడుతున్నాడనే కోపంతో  చిన్నారిని అని చూడకుండా బావిలో తోసి హత్య చేసింది. ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుప్పూర్‌ జిల్లా గాంగయం సమీపంలోని సేమలై వలసు గ్రామానికి చెందిన శ్రీరంగన్‌. అతని భార్య తిరుమాయి. వీరికి కుమారుడు కార్తిక్, కుమార్తె కలైవాణి (8) ఉన్నారు. తిరుమాయి కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. తండ్రి రెండో వివాహం చేసుకోవడంతో కార్తీక్‌, కలైవాని నాన్నమ్మ తల్లి పెంపకంలో ఉన్నారు.

కలైవాణి అక్కడున్న పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. కొన్నాళ్లక్రితం కార్తిక్‌కు షామిలి (19) అనే యువతితో వివాహమైంది. కాగా, మూర్చ వ్యాధిలో చికిత్స పొందుతున్న కలైవాణి.. 2019 జూలైలో హఠాత్తుగా అదృశ్యమైంది. చిన్నారి కోసం గాలించగా ఊరి చివరున్న బావిలో శవంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. కలైవాణిని వదిన షామిలి బావిలో తోసి హత్య చేసినట్టు తెలిసింది. కలైవాణి మూర్చ రోగానికి తన భర్త ఎక్కువగా ఖర్చు చేస్తుండటంతో అది షామిలికి నచ్చలేదు. దీంతో చిన్నారిని బావి వద్దకు తీసుకెళ్లి తొంగిచూడమని చెప్పి ఆమెను బావిలోకి తోసి హత్య చేసినట్టు షామిలి ఒప్పుకోవడంతో పోలీసులు నిందితురాలిని శనివారం అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు