భర్తపై పగ.. క్రైమ్‌ థ్రిల్లర్‌ చూపించింది..

2 Mar, 2020 08:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌ : భర్తపై ఉన్న పగను చల్లార్చుకోవటానికి కన్న కొడుకును చంపేసిందో తల్లి. కేసును తప్పుదోవ పట్టించటానికి చూసి అడ్డంగా దొరికిపోయింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ తలపించే ఈ సంఘటన రాజస్తాన్‌లోని ఝుంజును జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్‌ ఝుంజును జిల్లాలోని బుధానియా గ్రామానికి చెందిన సునీత అనే మహిళ భర్తతో తరచుగా గొడవలు పడేది. దీంతో భర్తపై ఎలాగైనా పగతీర్చుకోవాలని అనుకుంది. ఇందుకోసం కన్నబిడ్డ ప్రాణాలను బలి చేసింది. నాలుగేళ్ల కుమారుడు వివన్ స్వామిని ట్యాంకులో ముంచి చంపేసింది. అనంతరం కేసును తప్పుదోవ పట్టించటానికి తన మణికట్టును బ్లేడుతో కోసుకుంది. సునీత తమ్ముడు.. తన అల్లుడిని ఎవరో చంపేశారని, అక్కను బ్లేడుతో కోశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి వెళ్లారు.

అక్కడ సునీత గది దగ్గర రక్తపు మరకలతో ఉ‍న్న బ్లేడును గుర్తించారు. అనంతరం పోలీసులు ఇంటి సభ్యులందరిని విచారించగా సునీత ప్రవర్తన వారికి అనుమానంగా తోచింది. ఆమెను కొంచెం గట్టిగా అడిగేసరికి చేసిన నేరం ఒప్పుకుంది. తనతో తరచూ గొడవలు పడుతున్న భర్తపై పగ తీర్చుకోవటానికే కొడుకును చంపినట్లు తెలిపింది. కేసును తప్పుదోవ పట్టించటానికి మణికట్టును కోసుకున్నట్లు చెప్పింది. చేసిన నేరం ఒప్పుకోవటంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు