మాయలేడి ఆటకట్టు

9 Nov, 2019 06:12 IST|Sakshi
నిందితురాలు సుల్తానా

పెళ్లికాని యువకులే టార్గెట్‌

మాటలతో ఎర బ్లాక్‌మెయిలింగ్‌ చేసి డబ్బులు వసూలు  

గన్‌ఫౌండ్రీ: పెళ్లికాని యువకులే ఆమె టార్గెట్‌. మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్న మాయలేడిని శుక్రవారం అబిడ్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవికుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మలక్‌పేట్‌ ప్రాంతానికి చెందిన షాదాన్‌ సుల్తానా ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి న్యాయవాదిగా పని చేస్తోంది. ఆమెకు అబిడ్స్‌లోని మైనారిటీ  సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ రికార్డు అసిస్టెంట్‌ రహీంతో 2015లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాకునేవారు, పలు మార్లు అతడితో కలిసి తిరిగింది. అప్పుడప్పుడు  అతడి నుంచి డబ్బులు తీసుకుంది. రహీంను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఆమె తమ మధ్య సన్నిహిత్యాన్ని బయటపెడతానని బెదిరిస్తూ అతడి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేది. ఆరు నెలల కింద అతని నుంచి రూ.3 లక్షలు తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంది. మరో రూ.5 లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో తనను వేధిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో మనస్తాపానికిలోనైన రహీం గత నెల 19న అబిడ్స్‌లోని తన కార్యాలయం సమీపంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితురాలు షాదాన్‌ సుల్తానాను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. 

2014 నుంచి ప్రేమ నాటకం....
షాదాన్‌ సుల్తానా నిజామియా 2014 నుంచే ప్రేమ నాటకాలు మొదలు పెట్టింది. అదే సంవత్పరం ప్రేమ పేరుతో ఇద్దరిని  మోసం చేసింది. 2018లో ఏకంగా 14 మందిని తన వలలో వేసుకుని మోసం చేసింది. 2019లో ముగ్గురిని మోసం చేసింది. నిందితురాలిపై సైఫాబాద్‌ పీఎస్‌లో 3, చాదర్‌ఘాట్‌లో 5, ఎల్బీనగర్‌లో 3, అంబర్‌పేట్‌ 2, అబిడ్స్‌లో 2, మీర్‌ చౌక్‌లో 4, నారాయణగూడ, మలక్‌పేట్, నల్లకుంట, ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కాగా ఈమె బాధితుల్లో ఓ యువ లాయర్‌ కూడా ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు