తమ్ముడు, పిల్లలతో సహా మహిళ అదృశ్యం

19 May, 2018 11:45 IST|Sakshi
అదృశ్యమైన రాగిణి ,కుమార్తె నిహారిక, కుమారుడు నిహాస్‌, తమ్ముడు నీరజ్‌

వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని వైనం

కావలిరూరల్‌: కూతురు, కొడుకు, తమ్ముడుతో కలిసి వాకింగ్‌కు వెళ్లిన ఓ మహిళ గురువారం రాత్రి అదృశ్యమైంది. రాత్రంతా గాలించినా కుటుంబ సభ్యులు, భర్త శుక్రవారం రెండోవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ జీ ఎల్‌ శ్రీనివాస్‌ సమాచారం మేరకు.. కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టకు చెందిన రాగినూతల ప్రేమచంద్‌కు 8 ఏళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రాగిణితో వివాహమైంది. వీరికి నిహారిక (6), నిహాస్‌ (4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాగిణి కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఎజైల్‌ గ్రూపు తరఫున శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త ట్యాక్సీ డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాగిణి తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి, తమ్ముడు సైతం రాగిణి వద్దే ఉంటున్నారు.

కుమార్తె, కుమారుడు, తమ్ముడు నక్కపల్లి నీరజ్‌ (16)తో కలిసి రాగిణి గురువారం రాత్రి 7 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. వాకింగ్‌కి వెళ్లి గంట సేపు దాటినా తిరిగి రాకపోవడంతో నాని రాగిణి మొబైల్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో కంగారు పడిన నాని బంధువులు, స్నేహితుల ఇళ్లకు ఫోన్‌ చేసి వాకబు చేయగా రాలేదని తెలిపారు. సమీపంలో జరుగుతున్న సువార్త మహాసభలకు ఏమైనా వెళ్లుంటారేమోనని భావించి అక్కడ సైతం వెతకగా కనిపించలేదు. అర్ధరాత్రి 2 గంటల వరకు వెతికిన తర్వాత 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వారి ఫొటోలు తీసుకున్న సీఐ జీఎల్‌ శ్రీనివాస్‌ రాగిణి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి వివరాలు తీసుకున్నారు. సీఐ సూచన మేరకు ఎస్సై చల్లా వాసు కేసు నమోదు చేసుకున్నారు. రాగిణి సెల్‌ ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.   

మరిన్ని వార్తలు