మహిళపై గ్యాంగ్‌ రేప్‌.. సజీవ దహనం

16 Jul, 2018 03:29 IST|Sakshi
మంటల్లో పూర్తిగా కాలిపోయిన అత్యాచార బాధితురాలు

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం

బాధితురాలి అత్యవసర ఫోన్‌ కాల్‌కు స్పందించని పోలీసులు

సంభాల్‌: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డ దుండగులు ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లా గున్నార్‌ ప్రాంతం పాతక్‌పూర్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ(30) తన కూతురితో కలిసి ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన ఆరామ్‌ సింగ్‌. మహావీర్, చరణ్‌ సింగ్, గుల్లూ, కుమార్‌పాల్‌ అనే వ్యక్తులు బలవంతంగా లోపలికి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు 100 నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు తెలిపింది.

దీంతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా ఈ అఘాయిత్యాన్ని వివరించింది. ఇంతలోనే తిరిగి వచ్చిన నిందితులు ఆమెను సమీపంలో ఉండే ఆలయ ప్రాంగణంలో యజ్ఞశాలగా భావిస్తున్న గుడిసెలోకి ఈడ్చుకెళ్లి నిప్పుపెట్టారు. మంటల్లో ఆమె మృతి చెందగా నిందితులు పరారయ్యారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితులపై గ్యాంగ్‌రేప్, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి నేరాలకుగాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో అకీల్‌ అహ్మద్‌ తెలిపారు.

మృతురాలి భర్త కూలి పనులు చేసుకుంటూ ఘజియాబాద్‌లో ఉంటుండగా కొంతకాలంగా నిందితులు మృతురాలిని వేధిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. అయితే, ఆమెపై గ్యాంగ్‌రేప్‌ జరిగినట్లు నిర్ధారించేందుకు పోస్ట్‌మార్టం నివేదిక సరిపోదనీ, అందుకే అవసరమైన నమూనాలను మొరాదాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతున్నామని సంభాల్‌ ఎస్పీ భరద్వాజ్‌ చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

మరిన్ని వార్తలు