ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలి

30 Nov, 2019 08:00 IST|Sakshi

సాక్షి, పిఠాపురం(తూర్పు గోదావరి): ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించాలంటూ చేబ్రోలుకు చెందిన బండి దుర్గాభవాని శుక్రవారం రాత్రి గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం గోర్స సమీపంలోని ఆనంద్‌ నగర్‌కు చెందిన సలాది నాగేశ్వరరావు, దుర్గాభవాని రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే ముఖం చాటేసి వేరే పెళ్లికి సిద్ధపడ్డాడు. దీంతో దుర్గాభవాని తన తల్లిదండ్రులు, బంధువులతో కలసి గొల్లప్రోలు పోలీస్‌ స్టేషన్‌ ముందు 216 జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి నిరసనకు దిగింది. తాళి»ొడ్డు, పూలదండలతో రోడ్డుపై బైఠాయించింది. నాగేశ్వరరావుతో తన వివాహం జరిపించాలని పట్టుబట్టింది. దీంతో మెయిన్‌రోడ్డుపై రెండు గంటలు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గొల్లప్రోలు ఎస్సై ఎన్‌.రామలింగేశ్వరరావు ఆ యువతికి, బంధువులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళన విరమించలేదు. పిఠాపురం సీఐ బి.సూర్య అప్పారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను బైపాస్‌ రోడ్డువైపు మళ్లించారు. రాత్రి పది గంటలకు కూడా నిరసన కొనసాగుతోంది.  దుర్గాభవాని ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

మరిన్ని వార్తలు