ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి 

10 Jan, 2020 09:19 IST|Sakshi
ఆందోళన చేస్తున్న యువతి, తల్లిదండ్రులు

సాక్షి, కారేపల్లి(ఖమ్మం): వెంటపడి ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతిని మోసం చేసి.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం కారేపల్లి మండల పరిధిలోని పోలంపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. భాగ్యనగర్‌ తండాకు చెందిన వాంకుడోత్‌ సోనియా ఖమ్మంలో డిగ్రీ చదువుతోంది. తల్లిదండ్రులు వాంకుడోత్‌ లక్ష్మి, లాలు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లారు. దీంతో సోనియాను తమ పెద్దకూతురు వద్ద ఉంచారు. అదే గ్రామానికి చెందిన అజ్మీరా సంపత్‌ పీజీ పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న సోనియా వెంటపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. పెళ్లి విషయం ఎత్తగానే అక్కాచెల్లెళ్ల వివాహాల తర్వాత చేసుకుంటానంటూ నాలుగేళ్లుగా వాయిదా వేస్తున్నాడు.

ఈ క్రమంలో మరో యువతితో పెళ్లి ఖరారు చేసుకున్నారని తెలియడంతో సోనియా బుధవారం సంపత్‌ ఇంటికి వచ్చి నిలదీసింది. పెళ్లి చేసుకోవాలని దీక్షకు దిగింది. ‘నిన్ను తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోనని, మీ అమ్మనాన్నలను పిలిపించాలని’మళ్లీ నమ్మబలికాడు. పెద్దలు జోక్యం చేసుకోని గురువారం పంచాయితీ చేద్దామని, అప్పటివరకు ఎవరి ఇంటికి వారు వెళ్లాలని తెలిపారు. తీరా గురువారం సంపత్‌ ఇంటికి రాగా బుధవారం రాత్రే అతను పెళ్లి చేసుకున్నాడు. తనకు ప్రియుడితోనే వివాహం జరిపించాలని, అతనితోనే చావైనా, బతుకైనా అంటూ సంపత్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తన తల్లిదండ్రులతో కలిసి కారేపల్లి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు