ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన

13 Sep, 2019 13:25 IST|Sakshi
వెల్లంకిలో ప్రియుడి ఇంటి ఎదుట బంధువులతో కలసి ఆందోళన చేస్తున్న యువతి

సాక్షి, విజయవాడ(నందిగామ) : ఒంటరిగా ఉంటున్న మహిళను యువకుడు మాయ మాటలు చెప్పి లోబర్చుకుని గర్భవతిని చేసి ముఖం చాటేయటంతో బాధిత మహిళ బంధువులతో కలసి ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన తోట లక్ష్మీప్రసన్నకు మూడేళ్ల క్రితం కంచికచర్ల పట్టణానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఇద్దరి మధ్య విబేధాలు రావటంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వెల్లంకి గ్రామానికి చెందిన షేక్‌ సలీం ఆమెకు దగ్గరయ్యాడు. వీరిరువురు కుటుంబ సభ్యులకు తెలియకుండా సుమారు రెండేళ్ల నుంచి ఇబ్రహీంపట్నంలో సహజీవనం చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న సలీం కుటుంబ సభ్యులు అతడిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఆ తరువాత కూడా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆమెతో సంబంధం సాగించాడని మహిళ చెబుతోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భివతినని న్యాయం చేయాలని మహిళ కోరుతోంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామగణేష్‌ గ్రామానికి చేరుకుని మహిళ, బంధువులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించివేశారు. 

 

మరిన్ని వార్తలు