ప్రాణం తీసిన ప్రవర్తన

11 May, 2018 08:35 IST|Sakshi
నిందితులతో డీఎస్పీ మునిరామయ్య తదితరులు

ఢిల్లీ వాసి హత్య కేసులో నిందితుల అరెస్టు

బైక్, ఇనుప రాడ్‌ స్వాధీనం

యువతితో అసభ్య ప్రవర్తన, పిన తల్లిపై వేధింపులతో హత్య

తిరుపతి క్రైం : చెడు ప్రవర్తనే ఢిల్లీ వాసి మణితుల్లీ (28) పాలిట మృత్యువైంది. యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు పిన తల్లిని వేధింపులకు గురిచేస్తుండడంతో అతని బంధువులు రాడ్డుతో తలపై మోది హత్య చేశారు. ఈ మేరకు నిందితులు నేరాన్ని అంగీకరించారు. తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లాడ్జిలో మంగళవారం జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈస్టు సబ్‌ డివిజనల్‌ డీఎస్పీ మునిరామయ్య గురువారం ఈస్టు పోలీసు స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. పంజాబ్‌కు చెందిన మణితుల్లీ (28)కి ఢిల్లీలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న చంద్రగిరి మారుతీనగర్‌కు చెందిన యాస్మిన్‌ను 2016 ఆగస్టులో పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. వీరు ఈ నెల 24న వీరు తిరుపతికి వచ్చారని తెలిపారు. గోవిందరాజుల స్వామి ఆలయం సమీపంలో ఉడ్‌సైడ్‌ లాడ్జిలో రూమ్‌ను అద్దెకు తీసుకున్నారని పేర్కొన్నారు. 6వ తేదీ యాస్మిన్‌ అక్క కూతురు మసుధ, కుమారుడు మసుధర్, అతని స్నేహితుడు తరుణ్‌కుమార్‌ అలియాస్‌ ఫయాజ్‌తోపాటు మణితుల్లీ నెల్లూరులోని మైపాడ్‌ బీచ్‌కు వెళ్లారని తెలిపారు.

హత్యకు దారి తీసిన అసభ్య ప్రవర్తన
యాస్మిన్‌ అక్క కొడుకు మసుధర్‌ స్నేహితుడు తరుణ్‌కుమార్‌ అలియాస్‌ ఫయాజ్‌ హిందూ మతానికి చెందినవాడన్నారు. మసుధను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిపారు. బీచ్‌కు వెళ్లిన సమయంలో మసుధతో మణితుల్లీ అసభ్యంగా ప్రవర్తించడంతో తరుణ్‌కుమార్‌ అలియాస్‌ ఫయాజ్‌ గొడవపడ్డాడన్నారు. యాస్మిన్‌ జోక్యంతో అప్పటికి గొడవ సద్దుమణిగినా ఢిల్లీకి వెళ్లేలోపు మణితుల్లీని అంతం చేయాలని ఫయాజ్‌ అనుకున్నాడని పేర్కొన్నారు. 7వ తేదీన యాస్మిన్‌ భోజనం తెచ్చేందుకు ఇంటికి వెళ్లిందన్నారు. తనకు రూమ్‌లో బో రుగా ఉందని భార్య యాస్మిన్‌కు చెప్పడంతో ఆమె సూచన మేరకు మసుదూర్, అతని స్నేహితుడు తరుణ్‌కుమార్‌ అలియాస్‌ ఫయాజ్‌ హోటల్‌కు వెళ్లారని తెలిపారు.

అందరూ కలసి మద్యం తాగారని, ఈ క్రమంలో మణితుల్లీతో తరుణ్‌కుమార్‌ గొడవ పడ్డాడని వివరించారు. పిన తల్లి యాస్మిన్‌ను వేధిస్తున్నాడంటూ మసుదూర్‌ కూడా కోపంతో రగిలిపోయాడన్నారు. వారి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో మణితుల్లీ తలపై బలంగా మోది చంపేశారని తెలిపారు. తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. లాడ్జి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని విచారిస్తుండగా యాస్మిన్‌ అక్కడకు వచ్చిందన్నారు. ఆమెను విచారించడంతో అసలు విష యం తేలిందన్నారు. మణితుల్లీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి ఢిల్లీ పోలీసులను సంప్రదించి మృతుడి గురించి తెలిపామన్నారు. ఈ కేసులో యాస్మిన్‌కు  సంబంధం లేదని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు