భర్త ఇంటి ముందు వివాహిత నిరసన 

20 Aug, 2019 10:26 IST|Sakshi
నిరసన తెలుపుతున్న వివాహిత

సాక్షి, ఖమ్మం(సత్తుపల్లిటౌన్‌) : మాయమాటలు చెప్పి ప్రేమపెళ్లి చేసుకొని ఉడాయించాడని ఓ మహిళ భర్త ఇంటి ముందు నిరసన దీక్షకు దిగిన సంఘటన సత్తుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన బాణోతు పద్మజ 2017లో సత్తుపల్లిలో ఇంటర్‌ చదివేటప్పుడు.. సత్తుపల్లిలోని శ్రీనివాసా టాకీస్‌రోడ్‌లోని షేక్‌ ఖుర్షీద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. హైదరాబాద్‌లో చదువుకునేందుకు వెళ్లి ఇరువురు కలిసి తిరిగారు. రెండేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పద్మజను మతమార్పిడి చేయించాడు. ఇరువైపుల పెద్దలకు తెలియకుండానే హైదరాబాద్‌లోని మోతినగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు.

పెళ్లి తరువాత కొన్నిరోజులు హాస్టల్‌లో ఉండమని చెప్పి.. కాపురం పెట్టేందుకు ఆమె వద్ద నుంచి పొలం అమ్ముకొని వచ్చిన రూ.15 లక్షలను తీసుకొని సత్తుపల్లి వచ్చాడు. ఆ తర్వాత ఆమె ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించటం లేదని వాపోయింది. మతం మారటంతో తన కుటుంబ సభ్యులు కూడా తనను ఇంటికి రానివ్వటంలేదని కన్నీళ్లు పెట్టింది. దీంతో సోమవారం నేరుగా సత్తుపల్లిలోని అతని ఇంటికి వచ్చింది. దీంతో ఖుర్షీద్‌ కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదంటూ దూషించటంతో ఆమె ఇంటి ముందే నిరసనకు దిగింది. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.సురేష్‌ తెలిపారు.  
     

మరిన్ని వార్తలు