తిరువనంతపురం : నిస్సహాయ స్థితిలో ఓ మహిళ భర్త శవంతో రాత్రంతా గడపాల్సి వచ్చింది. శరీరాన్ని కబళిస్తున్న క్యాన్సర్ రోగం ఓ వైపు, ఇంటి పైకప్పుకు వేలాడుతున్న భర్త శవం ఓ వైపు నరకం అనుభవించిందా మహిళ. ఈ విషాదకర సంఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 67 ఏళ్ల జోషి క్యాన్సర్ బాధితురాలైన భార్య లిస్సితో కలిసి అలువలో నివాసముంటున్నాడు. వేరువేరు కారణాల వల్ల పిల్లలు వీరికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం లిస్సి ఒంటరిగా కిమియోథెరపీ చికిత్స చేయించుకోవటానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. తలుపు తెరిచిచూసి ఒక్కసారిగా షాక్కు గురైంది.
జోషీ ఇంటి సీలింగ్కు వేలాడుతూ కనిపించటంతో, ఆమె గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విన్న పొరిగింటివారు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్నారు. అయితే తమ ఫార్మాలిటీస్ ప్రకారం ఉదయం వరకు బాడీని కిందకు దించడానికి వీల్లేదని వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఆమె ఆ రోజు రాత్రి మొత్తం భర్త శవంతో గడపాల్సి వచ్చింది. మరుసటి రోజు ఉదయం అక్కడకు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.