కర్నూలు జిల్లా నాగలాపురంలో ఘటన
సాక్షి, ఆదోని టౌన్ : ఉన్నత చదువు చదివినప్పటికీ రెండేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం నాగలాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. యువతి తండ్రి మహదేవరెడ్డి, ఆదోని ప్రభుత్వాస్పత్రి ఔట్పోస్టు పోలీసులు కథనం ప్రకారం.. పెద్దకడబూరు మండలం నాగలాపురానికి చెందిన సులోచన, మహదేవరెడ్డి దంపతులు వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కొడుకు, కుమార్తె సంతానం. కూతురు వీణాను కర్నూలులో ఎంబీఏ చదివించారు.
ఆమె ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలో గురువారం రాత్రి బెంగళూరులో ఇంజనీర్గా పనిచేస్తున్న తమ్ముడు యోగానందరెడ్డితో ఫోన్లో మాట్లాడింది. జాబ్ చూడాలని కోరింది. ప్రయత్నిస్తానని, అధైర్యపడొద్దని తమ్ముడు ధైర్యం చెప్పాడు. అయినా వీణా తీవ్ర మనోవేదనకు గురై శుక్రవారం ఉదయం ఇంట్లోనే పురుగు మందు తాగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.