ప్రియుడు ఫోన్‌ చేయలేదని ప్రియురాలు ఆత్మహత్య

8 Jul, 2018 17:14 IST|Sakshi
శివాని

నోయిడా : ప్రియుడు ఫోన్‌ చేయలేదన్న బాధతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందో యువతి. ఈ సంఘటన శనివారం సాయంత్రం నోయిడా నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కస్‌జంగ్‌ ప్రాంతానికి చెందిన శివాని(25) నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె గత కొద్ది నెలలుగా బరోలాలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. శనివారం సాయంత్రం సమయంలో ఆమె గ్రేట్‌ ఇండియా ప్లేస్‌ మాల్‌లోని మూడవ అంతస్తు నుంచి కిందకు దూకింది. నేలపై రక్తపు మడుగులో పడివున్న ఆమెను గుర్తించిన మాల్‌ సిబ్బంది దగ్గరలోని కైలాశ్‌ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. మార్గం మధ్యలోనే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మాల్‌ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు సంఘటనా స్థలంలో ఓ సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ప్రిముడు స్పందించకపోవటం మూలానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతి సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఆమె చాలా సేపు ఎస్కలేటర్‌ దగ్గరలో ఫోన్‌ పట్టుకు కూర్చుందని, కొద్ది సేపటి తర్వాత పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు.  పోలీసు అధికారి మాట్లాడుతూ.. యువతి తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌ నోట్‌లో పేర్కొందని తెలిపారు. శివాని తల్లిదండ్రులను సంప్రదించటానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రియుడే ఆమె చావను ప్రేరేపించాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

మరిన్ని వార్తలు