ఐటీ సిటీలో మహిళపై అరాచకం..

5 Apr, 2019 13:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూర్‌ : మహిళను అత్తింటి వారు దారుణంగా వెంటాడి, అత్యంత క్రూరంగా హింసించిన ఘటన ఐటీ సిటీ బెంగళూర్‌లోని కమ్మనహళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. మహిళను నడిరోడ్డుపై ఆమె మరిది సహా అతడి కుటుంబ సభ్యులు రాళ్లతో, చెప్పులతో కొట్టడంతో పాటు దుస్తులను లాగి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించడంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. తనపై దాడికి తెగబడిన మరిది, అతని కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బాధితురాలు బనస్‌వాడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితురాలి భర్త ఈ ఏడాది జనవరిలో మరణించగా ఇద్దరు కుమార్తెలతో కలిసి మరిది ఇతర కుటుంబ సభ్యులతో బనస్‌వాడిలోని మెట్టినింట్లో నివసిస్తోంది. కాగా ఆమె ప్రవర్తనను నిందిస్తూ ఆడపడుచు ప్రమీల ఇటీవల బాధితురాలితో ఘర్షణకు దిగింది. ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటోందని నిందిస్తూ బాధితురాలిని ఇంటి నుంచి వెళ్లాలని ఆమెపై చెప్పులు, రాళ్లు విసిరేసింది.

తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తింటి వారు మరింత రెచ్చిపోయారని బాధితురాలు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ తనపై కత్తితో దాడి చేసేందుకు ప్రమీల దూసుకొచ్చిందని, కొంతసేపటికి ఆమె భర్త సతీష్‌, కుమార్తె సైతం తనపై దాడి చేశారని, వారు తన దుస్తులు లాగేసి తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఈ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసిన తన కుమార్తెను సైతం వారు గాయపరిచారని తెలిపారు. కాగా బాధితురాలి ఫిర్యాదుపై సతీష్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు