మహిళ దారుణ హత్య

19 Mar, 2018 08:55 IST|Sakshi
హత్యకు గురైన పద్మమ్మ

ఆస్తి వివాదాలతోనే కారణం  

తోటపల్లిగూడూరు: ఆస్తి తగాదాల నేపథ్యంలో మండంలోని నరుకూరుకు చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. నరుకూరు పంచాయతీ తూర్పు గమళ్లపాళెంకు చెందిన వేగూరు వెంకటరమణయ్య, వేగూరు బలరామయ్య కుటుంబాల మధ్య కొద్ది కాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వేగూరు వెంకటరమణయ్య భార్య పద్మమ్మ (40) శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. పాత కక్షలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో వేగూరు బలరామయ్య, వేగూరు పద్మమ్మ, వేగూరు భాస్కర్, వేగూరు శివకుమార్, వేగూరు శ్రీహరి ఇంట్లో ఒంటరిగా ఉన్న పద్మమ్మ రాడ్లతో తీవ్రంగా దాడిచేసి దారుణంగా హత మార్చారు.

 పద్మమ్మ కుమారుడు వేగూరు సతీష్‌ ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు మేరకు.. నెల్లూరురూరల్‌ డీఎస్సీ రాఘవరెడ్డి, కృష్ణాపట్నం పోర్టు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శివకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు దారి తీసిన వివరాలను సేకరించారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు నిందితులు వేగూరు బలరామయ్య, పద్మమ్మ, భాస్కర్, శివకుమార్, శ్రీహరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  కృష్ణపట్నం పోర్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న నెల్లూరురూరల్‌ డీఎస్పీ రాఘవరెడ్డి కృష్ణపట్నం పోర్టు సీఐ శ్రీనివాసరావు   

మరిన్ని వార్తలు