వదిలించుకునేందుకే హత్య

2 Feb, 2018 08:41 IST|Sakshi
నిందితులతో సీఐ ఉదయ్‌కుమార్‌

వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

హతురాలిది హైదరాబాద్‌లో పటాన్‌చెరువు

ఇద్దరిని అరెస్టు చేసిన కొయ్యూరు పోలీసులు

కొయ్యూరు(పాడేరు): మండలంలోని డౌనూరు జీడితోటల్లో జరిగిన గుర్తుతెలియని వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు.  అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం, ఫోన్‌కాల్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హంతకులను పట్టుకున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకునే వ్యక్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి, హంతకులను పట్టుకున్నారు. ఆ వివరాలను  సీఐ ఉదయ్‌కుమార్, ఎస్‌ఐ రుక్మాంగదరావు గురువారం  విలేకరులకు తెలిపారు. 

మండలకేంద్రమైన కోటవురట్లకు చెందిన జనవేది రాంబాబు తాపీమ్రేస్త్రిగా హైదరబాద్‌లో  పనిచేస్తున్నాడు.   హైదరాబాద్‌ పటాన్‌ చెరువు సమీపంలో టీ దుకాణం నిర్వహిస్తున్న  మైసపు శివమ్మతో పరిచ యం ఏర్పడింది. అక్కడే రోజూ టీ తాగి,  భోజనం చేసేవాడు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శిమమ్మకు వివా హమైనా భర్త లేడు. రాంబాబుకు భార్య, కుమారుడు ఉన్నారు. తనతో పూర్తిగా  ఉండిపోవాలని రాంబాబు ను శివమ్మ కోరేది. రాంబాబు కొడుకును కూడా ఇక్కడకు తీసుకువచ్చి ఉంచేయాలని అనేకసార్లు చెప్పింది. భార్య దగ్గరకు వెళ్లకుండా తనతో పూర్తిగా ఉండిపోవాలని పట్టుపట్టింది.  సంక్రాంతి సందర్భంగా  రాంబాబు,శిమమ్మ కలిసి కోటవురట్ల  వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత కూడా భార్యను వదిలిపెట్టి కొడుకుతో  కలిసి తనతో రావాలని గొడవ చేసింది. శివమ్మ దగ్గర నుంచి రూ.రెండు లక్షల వరకు రాంబాబు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని,  లేదా కొడుకును తీసుకుని తనతో రావాలని పట్టుపట్టింది. ఈ విషయం గ్రామంలో కొందరికి తెలిసింది. ఈమెతో ఉంటే  భార్యతో ప్రమాదం వస్తుందని రాంబాబు భావించాడు.  స్నేహితుడు కర్రి నరేశ్‌తో కలిసి హత్యచేయాలని ప్లాన్‌ వేశాడు.

జనవరి 22న శివమ్మను పర్యాటక ప్రాంతమైన చింతపల్లి మండలం తాజంగి తీసుకువచ్చాడు.అక్కడ సాయంత్రం వరకు ఆ ముగ్గురు ఉన్నారు.అయితే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ హత్యచేయడం కుదరలేదు. దీంతో డౌనూరు సమీపంలో జీడిమామిడి తోటలను ఎంచుకున్నారు.   చీకటి పడిన తరువాత శిమమ్మ, రాంబాబు,నరేశ్‌లు జీడితోటల్లోకి వచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం ముగ్గురూ కలిసి  మద్యం సేవించారు. ఈ సందర్భంగా రాంబాబు,శివమ్మ మధ్య వాగ్వాదం జరిగింది.  మద్యం మత్తులో ఉన్న శిమమ్మ మెడను  రాంబాబు బ్లేడ్‌తో  కోశాడు.దీనికి నరేశ్‌ సహకరించాడు. తరువాత రోజు ఏమి తెలియనట్టుగా వారిద్దరూ  గ్రామంలోకి వచ్చారు. వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లి,  ఇద్దరు రావడంపై కొందరికి అనుమానం వచ్చింది. 24న జీడితోటల్లో మృతదేహాన్ని కనుగొన్న కొయ్యూరు పోలీసులు విచారణ చేపట్టారు.  25న అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో కోటవురట్లకు చెందిన కొందరు సీఐకు  సమాచారం ఇచ్చారు.దాని ఆధారంగా విచారణ ప్రారంభించారు. హంతకుడు ఫోన్‌ను ట్రాప్‌ చేశారు. చివరకు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు