ఫోన్‌ డెలివరీ ఆలస్యంగా ఇచ్చాడని..

29 Mar, 2018 19:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ఈ కాలంలో మనుషులకు ఓపిక అనేది లేకుండా పోయింది. అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. లేకపోతే విచక్షణ కోల్పోతారు. ఒక్కోసారి అది ప్రాణాలు తీసే వరకూ వెళ్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే దేశ రాజధానిలో కలకలం రేపింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన ఫోన్‌ ఆలస్యంగా డెలివరీ ఇచ్చాడని  ఆగ్రహించిన మహిళ డెలివరీ బాయ్‌ని ఏకంగా కత్తితో 20సార్లు పొడిచింది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ముప్పై ఏళ్ల మహిళ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌పోన్‌ కొనుగోలు చేసింది. అయితే ఇతర డెలివరీల కారణంగా డెలివరీ బాయ్‌ కేశవ్‌ ఆమె ఫోన్‌ని ఆలస్యంగా అందించాడు. అయితే ఫోన్‌ ఆలస్యంపై కోపంగా ఉన్న సదరు మహిళ కత్తితో డెలివరీ బాయ్‌పై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచింది. తీవ్రంగా గాయపడిన కేశవ్‌ను సమీపంలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రాణాపాయం నుంచి కోలుకున్న కేశవ్‌ నుంచి స్థానిక పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మహిళకు సహకరించిన ఆమె సోదరుడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు నిహల్‌ విహార్‌, అంబికా ఎన్‌క్లేవ్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ నెల 24న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు