మహిళా అటెండర్‌ ఆత్మహత్య

6 Dec, 2018 11:47 IST|Sakshi
కవిత మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి గౌరమ్మ

అనంతపురం , కళ్యాణదుర్గం: ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న కవిత (24) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. తల్లి గౌరమ్మ తెలిపిన సమాచారం మేరకు.. కుటుంబ సభ్యులు నౌకరు పనిచేస్తూ చనిపోవడంతో పదో తరగతి చదువుకున్న కవితకు ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్‌ ఉద్యోగం లభించింది. ఈమె స్వస్థలం బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర. ఉద్యోగం రావడంతో కవిత తన తల్లితో కలిసి కళ్యాణదుర్గం పట్టణంలోని మారెంపల్లిలో నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి యథావిధిగానే ఇద్దరూ బయట గదిలో పడుకున్నారు.

తల్లి గాఢ నిద్రలో ఉండగా కవిత లోపలి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని పైకప్పు కడ్డీకి చీరతో ఉరివేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో తల్లి లేచిచూడగా కుమార్తె పక్కన కనిపించలేదు. లోపలి గది తలుపులు మూసి ఉండటంతో గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చింది. స్థానికులు వచ్చి లోపలికెళ్లి చూడగా కవిత ఉరికి వేలాడుతూ కనిపించింది. పెళ్లి సంబంధం కుదరకపోవడం, కడుపునొప్పితో బాధపడుతుండటంతో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని కవిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ రవీంద్రలు మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు.  

మరిన్ని వార్తలు