ర్యాష్‌ డ్రైవింగ్‌తో మహిళ హల్‌చల్‌

26 Jan, 2019 11:13 IST|Sakshi

చిక్కడపల్లి: అతివేగంగా కారు నడిపిన ఓ మహిళ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన సంఘటన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌కు చెందిన దీపాకురానా శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి అశోక్‌నగర్‌వైపు హోండా సిటీ కారులో అతివేగంగా వెళుతూ అశోక్‌నగర్‌ చౌరస్తా వద్ద బైక్‌పై వెళుతున్న  గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొట్టి అదే వేగంతో ముందుకు వెళ్లింది. దీంతో స్థానికులు చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి కారును వెంబడించి ఆపేందుకు ప్రయత్నించగా, ఆమె ఆపకపోవడంతో మధ్య మండలం కంట్రోల్‌రూమ్‌ ద్వారా సమాచారం అందుకున్న సైఫాబాద్‌ పోలీసులు కారును ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద నిలిపివేశారు.

దీంతో ఆమె పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు గతంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించి, ప్రస్తుతం కేంద్ర సర్వీస్‌లో ఉన్న ఉన్నతాధికిరి సమాచారం అందించింది. దీంతో ఆయన వెంటనే సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ గంగారాంకు ఫోన్‌చేసి సదరు మహిళ వద్ద వ్యక్తిగత వివరాలు తీసుకుని వదిలిపెట్టమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో సీఐ ఆమెను వదిలివేశారు. సదరు మహిళ తనను కారుతో ఢీకొట్టినట్లు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొనడం గమనార్హం. 

మరిన్ని వార్తలు