పురుగుమందు తాగి గృహిణి ఆత్మహత్య
అత్తింటి వారే హత్య చేశారు
మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
మియాపూర్: ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు గురువారం చేసుకుంది. అత్త, మామ, భర్త, ఆడపడుచు తమ కుమార్తెకు విషం తాగించి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీఐ వెంకటేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, మర్కాపురం మండలం, రాయవరం గ్రామానికి చెందిన బుచ్చయ్య, కొటమ్మ దంపతుల కుమార్తె శివమ్మ(26)కు అదే జిల్లా దర్శి మండలం, చెందలూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి, గురువమ్మల కుమారుడు శివశంకర్తో 2014 వివాహం జరిగింది. మేస్త్రీగా పని చేసే శివశంకర్ కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి మియాపూర్ గోకుల్ప్లాట్స్లో ఉంటున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. గత రెండేళ్లుగా భార్య భర్తల మ«ధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శివమ్మ సోమవారం ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను కూకట్పల్లిలోని రాందేవ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తమ కుమార్తె మృతికి ఆమె అత్తమామ, భర్త, ఆడపడు వేధింపులే కారణమని పేర్కొంటూ మృతురాలి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అత్తింటి వారే హత్య చేశారు :మృతురాలి తల్లిదండ్రులు బుచ్చయ్య, కోటమ్మ
ఆడ పిల్లలు పుట్టినందున అదనపు కట్నం తేవాలని శివమ్మ అత్తింటివారు ఆమెను తరచూ వేధించేవారని మృతురాలి తల్లిదండ్రులు బుచ్చయ్య, కొటమ్మ తెలిపారు. రెండేళ్లుగా నాలుగు సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్ది చెప్పి పంపామన్నారు. గత ఆరు నెలలుగా శివమ్మ తమ ఇంట్లోనే ఉందని పెద్ద మనుషుల సమక్షంలో జూన్ 25న పంచాయితీ పెట్టి కాపురానికి పంపినట్లు తెలిపారు. సోమవారం ఉదయం తమకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని భరించలేక పోతున్నానని చెప్పిందని. వారి వేధింపులు తాళలేకే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెను కూకట్పల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ఆ రోజు సాయంత్రం మళ్లీ ఇంటికి తీసుకొచ్చారని, అక్కడ డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పినా వారికి సమాచారం ఇవ్వకుండా ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. శివమ్మ భర్త శివశంకర్ ఫోన్ చేసి సమాచారం అందించడంతో మంగళవారం హైదరాబాద్ వచ్చిన తాము తమ కుమార్తెను మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లామని, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. తమ కుమార్తె మరణానికి కారణమైన ఆమె అత్తమామ, భర్త, ఆడపడుచులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.