ఫొటోలతో కాపురం కూలుస్తానంటున్నాడు..!

4 Dec, 2018 10:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గ్రీవెన్స్‌లో మృగాడిపై వివాహిత ఫిర్యాదు

తక్షణం చర్యలు తీసుకోవాలని

ఎస్‌ఐకి రూరల్‌ ఎస్పీ ఆదేశాలు

‘తెలిసీ తెలియక పెళ్లికాక ముందు నకరి కల్లు మండలానికి చెందిన బేగ్‌ అమీర్‌బాషాతో స్నేహం చేశా. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని నాతో ఫొటోలు దిగాడు. వాటిని నా భర్తకు చూపించి కాపురం కూలుస్తానంటూ బెదిరిస్తున్నాడు.. అలా జరగకూడదంటే  వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకుని నా కాపురం నిలబెట్టండి’ అంటూ ప్రకాశం జిల్లాకు చెందిన వివాహిత సోమవారం గుంటూరు రూరల్‌ ఎస్పీ రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎస్పీ తక్షణం ఆ మృగాడిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐని ఆదేశించారు.  

గుంటూరు: ‘‘స్నేహాన్ని అడ్డుగా పెట్టుకొని నాతో ఫొటోలు దిగాడు. వాటిని ఇప్పుడు చూపిస్తూ అతనితో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. లేకుంటే ఫొటోలను నీ భర్తకు చూపుతానని బెదిరిస్తున్నాడు’’ అంటూ ప్రకాశం జిల్లాకు చెందిన వివాహిత సోమవారం రూరల్‌ ఎస్పీ ఎస్‌.వి.రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసింది.

బాధితురాలి మాటల్లో... నకరికల్లు మండలం చల్లగుళ్ల అడ్డరోడ్డుకు చెందిన బేగ్‌ అమీర్‌బాషాతో పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరం కలసి ఫొటోలు దిగాం. ఫోన్‌లో మాట్లాడుకున్నాం. ఈ ఏడాది మే నెలలో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తితో నా వివాహం జరిగింది. అయితే అప్పటి నుంచి అతనితో దిగిన ఫొటోలు చూపించి, శారీరక సంబంధం పెట్టుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాడు. నేను అందుకు అంగీకరించకపోవడంతో అతని వద్ద ఉన్న ఫొటోలు, ఫోన్‌ రికార్డింగ్‌లను నాభర్తకు పంపుతానని, వాటిని అందరికీ తెలియ చేసి నీకాపురం కుప్పకూల్చుతానని హెచ్చరిస్తున్నాడు. తెలిసీ తెలియక అతనితో స్నేహం చేసిన పాపానికి నిత్యం మానసిక వేదనకు గురవుతున్నాను. ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యాను. అతని వద్ద ఉన్న ఆధారాలను మొత్తం నాకు అప్పగించి నాకు మనశ్శాంతిని చేకూర్చండి అంటూ వేడుకుంది. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే సదరు యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించాలని నకరికల్లు ఎస్‌ఐను ఆదేశించారు. ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వివాహితకు ఎస్పీ ధైర్యం చెప్పారు.

మరిన్ని వార్తలు