కారులో మహిళ మృతదేహం

2 May, 2019 11:12 IST|Sakshi
కారులో కవర్‌తో కప్పి ఉన్న మృతదేహం (ఇన్‌సెట్‌లో కారు)

అన్నానగర్‌: పెరుమానల్లూరు సమీపంలో మంగళవారం కారులో మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాలు.. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన గౌరవ్‌ అరోరా (35). ఇతనికి అదే రాష్ట్రానికి చెందిన ప్రస్‌జోత్‌ (29)కి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి తేజ్‌ (3) అనే కుమారుడు ఉన్నాడు. గౌరవ్‌ అరోరా తిరుప్పూర్‌ జిల్లా పోయమ్‌పాళయం అయ్యప్పనగర్‌లో కుటుంబంతో నివశిస్తున్నాడు. ఇతని ఇంటి మిద్దెపై బనియన్‌ సంస్థ నడుపుతున్నాడు. ఇదిలాఉండగా గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య తగాదాలు మొదలయ్యాయి.

గౌరవ్‌ అరోరా స్నేహితుడైన రాయపురానికి చెందిన రవీంద్రన్‌ వారిద్దరికి సర్ధిచెప్తూ వచ్చాడు. ఈ స్థితిలో మంగళవారం గౌరవ్‌అరోరా, రవీంద్రన్‌కి ఫోన్‌ చేసి తన భార్య మృతి చెందిందని, మృతదేహం కారులో ఉందని, కారు పెరుమానల్లూరు సమీపంలో నిలిపి ఉంచినట్టుగా తెలిపి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన రవీంద్రన్‌ పెరుమానల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. కారు ఉన్న స్థలానికి వెళ్లి చూడగా కారులో వెనుకసీటుపై ప్రస్‌జోత్‌ మృతదేహం కవర్‌తో కప్పి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోవై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బిడ్డతో సహా అజ్ఞాతంలో ఉన్న గౌరవ్‌అరోరా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు