సచ్చిదానంద్‌ మమ్మల్ని రేప్‌ చేశాడు: నలుగురు సాధ్వీలు

20 Dec, 2017 15:37 IST|Sakshi

లక్నో: ఓ ఆశ్రమానికి చెందిన బాబా, అతని అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరుపుతూ.. చిత్రహింసలకు గురిచేశారని నలుగురు మహిళా భక్తులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ ఆశ్రమంలో ప్రధాన గురువుగా ఉన్న బాబా సచ్చిదానంద్‌, అతని ఇద్దరు అనుచరులు తమపై అత్యాచారం జరిపారని మంగళవారం ఇద్దరు సాధ్వీలు ఆరోపించగా.. తాజాగా బుధవారం మరో ఇద్దరు సాధ్వీలు పోలీసులను ఆశ్రయించారు. సచ్చిదానంద, అతని ఇద్దరి అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరిపారని నలుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.

బాధిత సాధ్వీలపై కొంతకాలంగా ఆశ్రమంలోని మహాంత్‌లు ఒత్తిడి తెచ్చారని, తమ లైంగిక కోరికలు తీర్చేందుకు నిరాకరించడంతో వారిని ఆశ్రమంలో బంధించి అత్యాచారం జరిపారని పోలీసుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. బస్తీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితులకు వైద్యపరీక్షలు నిర్వహించామని, కేసు దర్యాప్తు జరుగుతోందని బస్తీ జిల్లా ఎస్పీ సంకల్ప్‌ శర్మ తెలిపారు.  

2008 నుంచి తాము ఆశ్రమంలో నివసిస్తున్నామని సాధ్వీలు తెలిపారు. 'నేను ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చాను. 12 ఏళ్ల వయస్సులో 2008లో నేను ఇక్కడికి వచ్చాను. అమాయకురాలిని కావడంతో నాపట్ల ఏం జరిగిదో తెలిసేది కాదు. నేను నిరాకరించినా ఇక్కడి ముగ్గురు బాబాలు నాపై అత్యాచారం జరిపారు.  నన్ను బందీగా ఉంచి.. కొడుతూ,, తరచూ అత్యాచారం జరిపారు' అని ఓ సాధ్వీ తెలిపారు.

మరిన్ని వార్తలు