పెళ్లికి వెళ్తూ పరలోకానికి..

11 Feb, 2019 08:29 IST|Sakshi
బస్సు నుంచి జారిపడి మృతి చెందిన లక్ష్మి

బస్సు నుంచి జారిపడి మహిళ దుర్మరణం

పారాపురంలో విషాదఛాయలు

శ్రీకాకుళం , కొత్తూరు: బంధువుల వివాహానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరిన మహిళ.. డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో జారి పడి దుర్మరణం చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన పప్పల లక్ష్మి అలియాస్‌ అప్పలమ్మ(48) శ్రీకాకుళంలొ జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం కొత్తూరు–శ్రీకాకుళం ఆర్టీసీ బస్సు ఎక్కి డోర్‌ వద్ద నిలబడింది. కొద్దిసేపటికే కుప్పిలి వాని చెరువు వద్ద ఉన్న మలుపు వద్దకు బస్సు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించేందుకు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు.

దీంతో లక్ష్మి ఒక్కసారిగా పట్టుతప్పి బస్సు నుంచి కిందకు జారిపడింది. బలమైన గాయాలు తగలడంతో వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి శివాజీ పరిశీలించగా అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. లక్ష్మికి భర్త రామారావు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, ఆర్టీసీ బస్సుకు తలుపు వేసి ఉంటే ప్రాణం పోయేది కాదని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు