కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

15 Feb, 2020 10:40 IST|Sakshi
మృతురాలి బంధువుల దాడిలో ధ్వంసమైన అత్తింటి వారి ఇల్లు

కుటుంబ కలహాలే కారణం

ఆగ్రహించిన మృతురాలి కుటుంబీకులు

అత్తింటి వారి ఇళ్లను ధ్వంసం చేసిన వైనం

సాక్షి, మెదక్‌ రూరల్‌: కుటుంబ కలహాలతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ మండలం జానకంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మార్గం దుర్గయ్య – పోచమ్మలకు శ్రీశైలం, రాములు, శేఖర్‌ ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడైన శేఖర్‌కు అదే గ్రామానికి చెందిన నిర్మల(28)ను ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. శేఖర్, శ్రీశైలం ఇద్దరు ఒకే ఉంట్లో ఉంటుండగా, రాములు వేరేచోట నివాసం ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఆస్తి పంపకాలు, వేరు కాపురం వంటి చిన్నపాటి గొడవలు శేఖర్, శ్రీశైలం కుటుంబాల మధ్య జరిగినట్లు తెలిపారు. కొత్త ఇంటిని నిర్మించే విషయంలో అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో కొంతకాలం సాఫీగా సాగిన శేఖర్‌–నిర్మల వివాహ బంధంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్నిటికీ నిర్మల కారణమని ఆమెను తరచూ సూటీ పోటి మాటలతో ఇబ్బందిపెట్టే వారని తెలిపారు. నిర్మలను ఉద్దేశించి అందరూ చస్తే.. చావు ఇంటి నిర్మాణం గురించి మాట్లాడకు అంటూ బెదిరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నిర్మల గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో అందరు నిద్రిస్తుండగా దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

ఈ విషయం తెలిసిన అదే గ్రామంలో ఉంటున్న నిర్మల అన్న బిక్షపతి, సమీప బంధువులు మార్గం వెంకటే‹Ù, మార్గం శ్రీనివాస్, మార్గం లింగం, మార్గం శంకర్‌లతో పాటు మరికొంత మంది ఆగ్రహంతో మృతురాలి భర్త ఇంటితో పాటు అతడి అన్నలు శ్రీశైలం, రాములు ఇళ్లను ద్వంసం చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి.  

పికెట్‌ నిర్వహించిన పోలీసులు.. 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పికెటింగ్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ అంజనేయులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా ఇరు వర్గాల పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే నిర్మలకు ఉన్న ఇద్దరు అక్కలు భూలక్ష్మీ, యశోదలు కూడా వేర్వేరు సందర్భాల్లో గతంలో చనిపోవడం పట్ల వారి అన్న భిక్షపతి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. 
తల్లి ప్రేమకు దూరమైన 

ఇద్దరు చిన్నారులు.. 
కుటుంబ కలహాలతో నిర్మల మృతి చెందడంతో సాతి్వక్, మనిదీప్‌ అనే ఆరేళ్లలోపు ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. తల్లి మృతి చెందగా, ఇళ్లను బంధువులు ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం నెలకొనగా ఏమి తెలియని పరిస్థితిలో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ రోదించడం అక్కడివారిని కంటతడిపెట్టించింది.  

మరిన్ని వార్తలు