మహిళ ప్రాణం తీసిన అంబులెన్స్‌ డ్రైవర్‌ బేరం

23 Dec, 2018 13:24 IST|Sakshi
ఆస్పత్రిలో మృతిచెందిన మహిళ అన్నా, వదినలు

మల్కన్‌గిరి:  మల్కన్‌గిరి జిల్లాలోని మల్కన్‌గిరి సమితి మర్కగుడ గ్రామంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ బేరమాడడంతో సకాలంలో ఆస్పత్రికి చేరలేక ఓ మహిళ మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పూల్‌పోడియామి అనే మహిళత కుటుంబసభ్యులు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుమందు తాగేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు ఇర్మా మడకామి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా వచ్చిన అంబులెన్స్‌ డ్రైవర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు రూ.1000 అవుతుందని డిమాండ్‌ చేశాడు.

అయితే తన దగ్గర అంత సొమ్ము లేదని మూడు వందల నుంచి నాలుగు వందల వరకు మాత్రమే ఇవ్వగలనని నిస్సహాయతను వ్యక్తం చేశాడు. దీనికి డ్రైవర్‌ ససేమిరా అన్నాడు. చివరికి ఇర్మా మడకామి డ్రైవర్‌ డిమాండ్‌ చేసిన డబ్బుకు ఒప్పుకుని ముందుగా రూ.500 ఇస్తా..ఆస్పత్రికి చేరాక రూ.500 ఇస్తానని ఒప్పించాడు. దీంతో బాధిత మహిళను అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. దీంతో ఆస్పత్రికి చేరుకున్న తరువాత మృతురాలి సోదరుడు ఇర్మా మడకామి డ్రైవర్‌ బేరం విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేయగా..సీడీఎంఓ అజిత్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ అంబులెన్స్‌ డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని బాధితుడికి నచ్చజెప్పారు.

మరిన్ని వార్తలు