నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

25 Dec, 2018 12:26 IST|Sakshi
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో లారీ చక్రాల కింద ఇరుక్కుపోయిన బైక్‌

పాదచారి, బైక్‌ను ఢీకొన్న లారీ

అక్కడికక్కడే మృతిచెందిన మహిళ

మరో ఇద్ద్దరికి తీవ్రగాయాలు

డ్రైవర్‌కు స్థానికుల దేహశుద్ధి

పశ్చిమగోదావరి, కొయ్యలగూడెం: లారీని నిర్లక్ష్యంగా నడిపి ప్రమా దం చేసిన డ్రైవర్‌ ఓ మహిళ ప్రాణాలను బలితీసుకోగా మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యా యి. సోమవారం ఉదయం బయ్యనగూడెం నడిరోడ్డుపై జరిగిన ప్రమాదంతో స్థానికులు హతాసులయ్యారు. ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన వాడపల్లి సుబ్బలక్ష్మి (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బైక్‌పై వెళుతున్న సింగంశెట్టి సత్యనారాయణ, కందుల బలరామకృష్ణకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో నిర్లక్ష్యంగా లారీని వేగంగా నడుపుతూ రోడ్డు పక్కన నడిచి వెళుతున్న సుబ్బలక్ష్మిని ఢీకొ ట్టాడు.

అనంతరం బైక్‌పై ఎదురుగా వస్తున్న వ్యక్తులను ఢీకొన్నాడు. బైక్‌ను కొద్దిదూరం ఈడ్చుకుంటూ లారీని వెళ్లనిచ్చాడు. దీంతో సుబ్బలక్ష్మి తల ఛిద్రమై అక్కడికక్కడే కన్నుమూసింది. స్థానికులు డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. క్షతగాత్రులు సత్యనారాయణ, బలరామకృష్ణను జంగారెడ్డిగూడెం తరలించారు. సత్యనారాయణ కాలు, చేయిను వైద్యులు తొలగించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో  గుంటూరు ఆసుపత్రికి తరలించారు. వాడపల్లి సు బ్బలక్ష్మి పొలానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. భర్త వెంకటేశ్వరరావుకు టీ తీసుకుని గ్రామానికి సమీపంలో ఉన్న పొలానికి నడిచి వెళుతుండగా మృత్యువు లారీ రూపంలో కబళించింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు