మహిళను చిదిమేసిన లారీ

3 Apr, 2018 11:07 IST|Sakshi
 కలమ్మ మృతదేహం  

రోడ్డుపై బైఠాయించిన కుటుంబ సభ్యులు 

ట్రాఫిక్‌ నియంత్రణలో వైఫల్యంపై మండిపాటు

స్తంభించిన ట్రాఫిక్‌ 

గజ్వేల్‌రూరల్‌: లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన సంఘటన మున్సిపల్‌ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ చౌరస్తా జగదేవ్‌పూర్‌ వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఎర్ర కలమ్మ(46) కూలీ పనులు చేస్తుంది. సోమవారం ఉదయం ప్రజ్ఞాపూర్‌ చౌరస్తా వద్ద జగదేవ్‌పూర్‌ మార్గంలో రాజీవ్‌ రహదారిని దాటుతుండగా గజ్వేల్‌ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న హరియాణకు చెందిన లారీ (హెచ్‌ఆర్‌ 55క్యూ 7034) ఆమెను ఢీకొని వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో కలమ్మ కాలు తెగిపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజీవ్‌ రహదారిపై రోడ్లకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గజ్వేల్‌ సీఐ ప్రసాద్, ట్రాఫిక్‌ సీఐ నర్సింగరావులు సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపైనే బైఠాయించారు.

మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ రోడ్డుపై «రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చజెప్పి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. మృతురాలు కలమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బాధిత కుటుంబ సభ్యులకు మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి ప్రతాపరెడ్డి బాధిత కుటుంబీకులను పరామర్శించారు.   

మరిన్ని వార్తలు