సాక్షి, బీబీనగర్ (భువనగిరి) : శుభలేఖలు పంచేందుకు వెళ్తున్న తల్లికుమారుడికి మార్గమధ్యలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ప్రమాదవశాత్తు బైక్పై నుంచి జారి కిందపడడంతో తల్లి తీవ్ర గాయాలపాలై దుర్మరణం పాలైంది. ఈ విషాదకర ఘటన మంగళవారం బీబీనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
తర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామ పరిధిలోని పెద్దతండాకు చెందిన పానుగోతు పూర్ణ(45) తన కూతురు వివాహానికి సంబందించిన పెళ్లి కార్డులను బంధువులకు పంచేందుకు మంగళవారం తన కుమారుడు రమేష్తో కలిసి ద్విచక్రవాహనంపై బీబీనగర్ వచ్చింది. కాగా బైక్పై వెళ్తున్న క్రమంలో వెనుక కూర్చున్న పూర్ణ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో తలకు, కడుపునకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.