ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

21 Apr, 2018 12:07 IST|Sakshi
అశ్విని మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

భర్తే చంపేశాడని బంధువుల ఆరోపణ

పోలీసులకు ఫిర్యాదు

గుడుపల్లె : మండలంలోని అగరం గ్రామంలో శుక్రవారం వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ భాస్కర్‌ కథనం మేరకు.. మండలంలోని అగరం గ్రామానికి చెందిన  నాగభూషణంకు అదే మండలం మల్దేపల్లెకు చెందిన సోమప్ప కుమారై అశ్విని(23)ని ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వీరి కాపురం సజావుగా సాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నాగభూషణం పొలం పనులకు వెళ్లాడు. అనంతరం ఏమి జరిగిందో కాని అశ్విని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. స్థానికులు గమనించి భర్తకు, మృతురాలి బంధువులకు సమాచారం అందించారు.

బంధువులు అక్కడికి చేరుకుని తమ కూతురిని భర్తే చంపేశాడని ఆరోపిస్తూ ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ భాస్కర్‌ అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత హత్యగా తేలితే చర్యలు తీసుకుంటామని మృతురాలి బంధువులకు హామీ ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయి రెండేళ్లకే కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు బోరును విలపించారు.

మరిన్ని వార్తలు